రాజేంద్రనగర్: ఆడపిల్లకు జన్మనిచ్చిందని మహిళపై శాడిస్టు భర్త వేడి గంజిపోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. నార్సింగి ఎస్సై శ్రీధర్ తెలిపిన మేరకు.. తాండూరుకు చెందిన పి.చెన్నయ్య(33) బతుకుదెరువు కోసం భార్య శాంత(28)తో పీరంచెరువు ప్రాంతానికి వలస వచ్చాడు. ఇప్పటికే శాంత ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. రెండవ కాన్పు సందర్భంగా ఆడపిల్ల పుట్టడంతో ఆ సమయంలో శాంతను తీవ్రంగా కొట్టడంతో కాలు విరిగింది.
ఆ సమయంలో కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి మందలించారు. శాంత ఈ నెల 20న మూడోకాన్పులో ఆడపిల్లలకు జన్మనిచ్చింది. 23న శాంత ఇంటికి రాగా భర్త చెన్నయ్య ఆమెతో గొడవ పడి కొట్టాడు. అనంతరం వేడి గంజిని తీసి శాంతపై పోశాడు. దీంతో శాంత చాతి, కడుపు, నడుముపై గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కొండాపూర్లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.