పట్టపగలే మరో ప్రేమోన్మాదం!

28 Mar, 2018 02:41 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తబస్సుమ్‌

     ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు

     తిరస్కరించడంతో ఆమె ఒంటికి నిప్పు

     చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితురాలు  

హైదరాబాద్‌: రాజధానిలో పట్టపగలే మరో ప్రేమోన్మాదం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు దిగిన యువకుడు ఆమె తిరస్కరించడంతో కక్షకట్టాడు. యువతి ఇంట్లోనే ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టి పరారయ్యాడు. 60 శాతం కాలిన గాయాలైన ఆమె ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్‌ గోల్నాక గంగానగర్‌లో నివసించే అర్షియాబేగం భర్త రియాజుద్దీన్‌ అన్సారీ కొంతకాలం క్రితం మృతిచెందారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్న అర్షియా.. తన కుమార్తె తబస్సుమ్‌ బేగం (17), ఇద్దరు కుమారుల్ని పోషిస్తోంది. పదో తరగతితో చదువు మానేసి, ఇంట్లోనే ఉంటున్న తబస్సుమ్‌ను గోల్నాక మార్కెట్‌లో కూరగాయల వ్యాపారైన సోహెల్‌ ప్రేమ పేరుతో వేధించడం మొదలెట్టాడు. తబస్సుమ్‌కు ఇటీవలే మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది.

ఇది తెలుసుకున్న సోహెల్‌ మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లోకి ప్రవేశించి ప్రేమించాలంటూ వేధించాడు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి, యువతి ఇంట్లోని కిరో సిన్‌ తీసుకొని ఆమెపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటలు తాళలేకపోయి న ఆమె కేకలు వేసింది. చుట్టుపక్కలవారు మంటలార్పి ‘108’ సాయంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడు సోహెల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. తబస్సుమ్‌కు నిప్పంటించే క్రమంలో అతనికీ గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడి, హత్యాయత్నం చేసిన నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు