సల్మాన్‌ ఖాన్‌కు మరో షాక్‌

7 Apr, 2018 08:28 IST|Sakshi

జోధ్‌పూర్‌ : బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు మరో షాక్‌ తగిలింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై సంగ్దిగ్ధం నెలకొంది. శనివారం పిటిషన్‌ విచారణకు రావాల్సి ఉండగా.. రాజస్థాన్‌ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది.  జోధ్‌పూర్‌ జిల్లా మరియు సెషన్స్‌ జడ్జిని బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

సల్మాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటున్న సెషన్స్‌ జడ్జి రవీంద్ర కుమార్‌ జోషితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 87 మంది జడ్జిలను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్‌ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా పడినట్లేనని.. ఆయన మరిన్ని రోజులు జైల్లోనే గడపాల్సి ఉంటుందని న్యాయ నిపుణలు చెబుతున్నారు. నిజానికి సల్మాన్‌కు శిక్ష ప్రకటించిన రోజే (గురువారం) బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కేసుపై మరోసారి పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఆయనకు బెయిల్‌ ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ధారిస్థానని జడ్జి జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం సల్మాన్‌కు బెయిల్‌ వస్తుందని అంతా భావించారు. (సల్మాన్‌కు శిక్ష హ్యాపీగా ఉంది : నటి)

ప్రస్తుతం జోషి స్థానంలో చంద్ర కుమార్‌ సొంగారాను జడ్జిగా బదిలీ చేశారు. చంద్ర కుమార్‌ తీసుకునే నిర్ణయంపైనే సల్మాన్‌ బెయిల్‌ ఆధారపడి ఉంటుంది. ఈ విషయమై న్యాయమూర్తిని కలిసి విజ్ఞప్తి చేస్తామని సల్మాన్‌ తరపు న్యాయవాది చెబుతున్నారు. 1998లో హమ్‌ సాథ్‌ సాథ్‌ హై చిత్ర షూటింగ్‌ సందర్భంగా రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. సుమారు 20 ఏళ్ల విచారణ తర్వాత జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. (సల్మాన్‌ కేసు.. మతం రంగు)

మరిన్ని వార్తలు