తండ్రీకొడుకుల దారుణ హత్య

19 May, 2020 14:16 IST|Sakshi
హత్యకు సంబంధించిన దృశ్యాలు(కర్టెసీ: ఎన్డీటీవీ)

ఎస్పీ నాయకుడి దారుణ హత్య

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, ఆయన కొడుకును దుండగులు హతమార్చారు. వివరాలు.. సంభాల్‌ జిల్లాలోని షామోసీ విలేజ్‌ ప్రధాన్‌‌ భర్త చోటే లాల్‌ దివాకర్‌, వారి కొడుకు సునీల్‌ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను సమీక్షించేందుకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణం గురించి వివరాలు తెలుసుకుంటున్న క్రమంలో సవీందర్‌ అనే వ్యక్తి కొంతమందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. తమ పొలాల గుండా రహదారి నిర్మాణం చేపట్టవద్దని ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రతరమైంది. దీంతో అసభ్య పదజాలంతో ఒకరినొకరు దూషించుకుంటూ పరస్పరం కొట్లాటకు దిగారు. ఈ క్రమంలో సవీందర్‌తో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో చోటే, సునీల్‌ను కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనలో చోటే, సునీల్‌ అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ర్యాప్తు జరుపుతున్నామని.. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. కాగా తండ్రీకొడుకుల హత్యకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సోషల్‌ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా 2017లో ఎస్పీ తరఫున ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి చోటే లాల్‌ దివాకర్‌ భంగపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన స్థానిక రౌడీలతో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయని.. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు