వివాహేతర సంబంధం : రాజకీయ నేత మృతి

15 Sep, 2018 16:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : సమాజ్‌వాది పార్టీకి చెందిన ఓ నాయకుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్య​క్తి సదరు రాజకీయ నాయకున్ని అతని ఇంట్లోనే తుపాకీతో కాల్చి చంపాడు. వివరాల ప్రకారం.. సంభాల్‌, నాయి బస్తీ ప్రాంతంలో నివాసం ఉంటున్న జగ్‌దీష్‌ మాలి (33) సమాజ్‌వాది పార్టీకి చెందిన నాయకుడు. అయితే మాలి భార్యకు దిలీప్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం గురించి గతంలో భార్యభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం మాలి ఇంట్లో లేని సమయంలో దిలీప్‌ అతని ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన మాలి  తన భార్య, దిలీప్‌తో ఉండటం చూసి అతనితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో దిలీప్‌ తన దగ్గర ఉన్న తుపాకితో మాలి మీద కాల్పులు జరిపాడు. ఈ దాడిలో మాలి అక్కడికక్కడే మృతి చెందాడు. మాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మాలి భార్యను, దిలిప్‌ను ఆరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు