ఇద్దరు ఎర్రచందనం దొంగల అరెస్ట్‌

9 Jul, 2018 10:09 IST|Sakshi
ఎర్రచందనాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ అభిషేక్‌ మొహంతి

రూ.2.25 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ఎస్పీ అభిషేక్‌ మొహంతి

తిరుపతి క్రైం:శేషాచల అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అర్బన్‌ జిల్లా రెడ్‌ శాండిల్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎమ్మార్‌పల్లి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అభిషేక్‌ మొహంతి స్మగ్లర్ల వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ రాత్రి రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీసులు తమిళనాడు జిల్లా ఆర్కాడు తాలూకా, అనైకాడు గ్రామానికి చెందిన ఎస్‌.కుమార్‌ (34)ను అరెస్ట్‌ చేశారని తెలిపారు. అతని నుంచి 631.75 కిలోల 22 ఎర్రచందనం దుంగలను, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. లారీ పైభాగంలో టమాట కాయలు ఉంచి కింద ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారని పేర్కొన్నారు. మిగిలిన నిందితులను పరారయ్యారన్నారు. పరారైన ఎల్‌ మధును ఈ నెల 7వ తేదీన గాజులమండ్యం పోలీసులకు వచ్చిన సమాచారంతో కర్ణాటక రాష్ట్రం రామ్‌నగర్‌ జిల్లా కనకాపురం బస్టాండ్‌ వద్ద అరెస్ట్‌ చేశామన్నారు.

అతనిచ్చిన సమాచారంతో అదే ప్రాంతంలోని దేవుల మఠం రోడ్డులో దీపు అనే వ్యక్తికి సంబంధించిన రంపపు మిల్లుపై దాడిచేసి 2.25 టన్నుల 76 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో ప్రధాన స్మగ్లర్‌ అప్సర్‌ అలియాస్‌ అప్రోజ్, మరి కొందరు స్మగర్లను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ప్రధాన స్మగ్లర్‌ శేషాచల అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనంను స్మగ్లింగ్‌ చేసి దీపుకు చెందిన రంపపు మిల్లును గోడౌన్‌లుగా ఉపయోగించుకుంటున్నట్టు గుర్తించామన్నారు. అనంతరం వాటిని అక్కడి నుంచి తమిళనాడు నుంచి విదేశాలకు తరలిస్తున్నాడని పేర్కొన్నారు. వీరిపై చిత్తూరు జిల్లాలో కేసులు ఉన్నాయని తెలిపారు. అర్బన్‌ జిల్లా సిబ్బంది ఎంతో కష్టపడి 3 రోజులు రెక్కీ నిర్విహించి స్మగ్లర్లను పట్టుకున్నారని వివరించారు. ఈ సమావేశంలో రెడ్‌శాండిల్‌ టాస్క్‌ఫోర్సు డీఎస్పీ రవికుమార్, ఎస్‌బీడీఎస్పీలు పాల్గొన్నారు.

రూ.లక్ష విలువైన ఎర్రచందనం స్వాధీనం
పుత్తూరు:పుత్తూరు ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని సదాశివకోనలో శనివారం రూ.లక్ష విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న ట్టు రేంజర్‌ సుబ్రమణ్యం తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ సదాశి వకోన అటవీ ప్రాంతంలో శనివారం ఎస్టీఎఫ్‌ సిబ్బంది, ఫారెస్ట్‌ అధికారులు సంయుక్తంగా దాడులు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 12 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీ నం చేసుకున్నామని చెప్పారు. వాటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని  తెలి పారు. ఈ దాడుల్లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ గంగాధరం, బీట్‌ ఆఫీసర్లు అబ్దుల్‌ బాషా, జగన్నాథం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు