ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లి కోనరావుపేటవాసి ఆత్మహత్య

2 Sep, 2018 02:04 IST|Sakshi

సరైన పనిలేక.. అప్పు తీర్చలేక..

కోనరావుపేట (వేములవాడ): ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ఓ యువ కుడు అక్కడ సరైన పనిలేక.. చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనస్తాపం చెందాడు.  రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన చెన్నమేని అంజయ్య–ఎల్లవ్వ దంపతుల ఏకైక కుమారుడు సతీశ్‌(30). తండ్రీకొడుకులు గతంలో మూడుసార్లు ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి సరైన పని దొరకక ఇంటికి తిరిగొచ్చారు.  అంజయ్య అప్పులు చేసి కూతురు పెళ్లి చేశాడు. మొత్తంగా అప్పు రూ.12 లక్షలకు చేరింది.   

అప్పుచేసి ఆరునెలల క్రితం సతీశ్‌ బహ్రెయిన్‌ వెళ్లగా, తండ్రి దోహాఖతార్‌ వెళ్లాడు. తండ్రి కూడా తక్కువ వేతనానికే పని చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు ఎలా తీరుతాయని తల్లి, భార్యకు తరచూ ఫోన్‌ చేసి మథనపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి  వీడియో(ఐఎంవో)కాల్‌ చేసి తల్లి, భార్య రాజ మణి, ఇద్దరు కొడుకులు చూస్తుండగానే గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. వారు వద్దని వారించినా వినలేదు. కళ్లెదుటే ఆత్మహత్య చేసుకుంటున్న సతీశ్‌ను ఎలా కాపాడాలో తెలియక కుటుంబం రోదిస్తూ ఉండిపోయింది.

మరిన్ని వార్తలు