టీడీపీ సీనియర్‌ నేతలపై ఎస్సీ,ఎస్టీ కేసు

13 Jun, 2020 10:53 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : టీడీపీ సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, పిల్లి అనంతలక్ష్మి దంపతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే  అనంతలక్ష్మి కుమారుడు రాధాకృష్ణకు భార్య ఉండగానే రెండో పెళ్లి చేసేందుకు యనమల, చినరాజప్ప, పిల్లి అనంతలక్ష్మి దంపతులు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భర్తకు రెండో పెళ్లి చేయించేందుకు యత్నించారని మంజుప్రియ వారిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంజు ప్రియ ఫిర్యాదుతో తొండంగి పోలీస్‌స్టేషన్‌లో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఏ1 పిల్లి రాధాకృష్ణ, ఏ2 పిల్లి సత్యనారాయణ, ఏ3 పిల్లి అనంతలక్ష్మి, ఏ4 యనమల కృష్ణుడు, ఏ5 యనమల రామకృష్ణుడు, ఏ6 చినరాజప్ప, ఏ7 సరిదే హరిలుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ( రెండో పెళ్లికి యత్నం; టీడీపీ నేతలే పెద్దలు )

కాగా, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతుల కుమారుడు రాధాకృష్ణకు బుధవారం అర్ధరాత్రి రెండో వివాహం చేసేందుకు యత్నించారు. దీనికి మాజీమంత్రులు యనమల, చినరాజప్ప తదితర టీడీపీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, రాధాకృష్ణ ఇదివరకే తనను పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు పుట్టాక తనను మోసంచేసి, ఇప్పుడు రెండో వివాహం చేసుకుంటున్నాడని సామర్లకోట మండలం మాధవపట్నానికి చెందిన పిల్లి మంజుప్రియ బుధవారం కాకినాడ ‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మరిన్ని వార్తలు