రూ.కోటి.. దోచు‘కుని’

9 May, 2018 03:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో భారీ అవినీతి

శస్త్రచికిత్స చేసిన వారికే మళ్లీ చేసినట్లు రికార్డులు

29 మంది అధికారుల చేతివాటం.. సర్కారుకు విచారణ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబ నియంత్రణ (కు.ని.) కార్యక్రమం అక్రమాలకు నెలవుగా మారింది. జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం నిధులను వైద్యారోగ్య శాఖ అధికారులు అందినకాడికి దోచుకున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకున్న వారికిచ్చే ప్రోత్సాహకం నిధులు స్వాహా చేశారు. 2002–2007 మధ్య జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణకు ఆదే శించగా..వైద్యారోగ్య శాఖలోని 29 మంది అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. వీరిలో ఏడుగురిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు నిధులు రికవరీ చేయాలని విచారణ నివేదిక స్పష్టం చేసింది. మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇటీవల ఈ నివేదికను, ప్రతిపాదనలను ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ ప్రభుత్వానికి అందించారు. చర్యల విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

ఫిర్యాదులు రావడంతో.. 
జనాభా నియంత్రణ విషయమై ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది. కుటుంబ నియంత్రణ చేయించుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. గతేడాది వరకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్న పురుషుడికి రూ.1,100.. మహిళలకు రూ.880 చొప్పున నేరుగా నగదు రూపంలో కేంద్రం చెల్లించింది. 2002–2007 మధ్య కాలంలో జరిగిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల కార్యక్రమంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులందడంతో విచారణకు ఆదేశించింది.  

ఒక్క జాబితానే ఐదారు ఆస్పత్రుల్లో.. 
ఒక ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారి జాబితానే మరో ఐదారు ఆస్పత్రుల్లో నమోదు చేసి నట్లు విచారణలో వెల్లడైంది. ఉమ్మడి వరంగల్‌లో అక్రమాలు ఎక్కువగా జరిగాయని, ఈ ఒక్క జిల్లాలోనే రూ.కోటికి పైగా నిధులు దుర్వినియోగమయ్యాయ ని విచారణలో తేలింది. అక్రమాలకు పాల్పడిన వారిలో ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ మినహా అందరూ వైద్యులే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిలో 8 మంది ఇప్పటికే పదవీ విరమణ చేశారు.
 
క్రిమినల్‌ కేసులు/రికవరీ చర్యలు:
ఎం. సరస్వతి, రఘురాం, టి.వీరస్వామి, ఎన్‌.రాజేశ్వర్, టి.ప్రకాశ్‌రావు, ఎం.సుగుణాకర్‌రావు, సీహెచ్‌ ప్రసాదరావు  శాఖాపరమైన చర్యలు: శ్రీరాం, మదన్‌మోహన్, ప్రవీణ్, బి.నెహ్రూ, ఎన్‌.గోపాల్‌రావు, నర్సింహస్వా మి, ఎస్‌.వెంకటేశ్వర్లు, కె.రాజు, బి.ఆర్‌.అంబేద్కర్, శ్రీనివాస్, రూబీ జాక్సన్, సుదర్శన్‌రావు, వెంకన్న, రంగారెడ్డి, కరుణశ్రీ, దమయంతి, విజయ కుమార్, ఎం.సత్యవతి, బి.వెంకటలక్ష్మి, సరస్వతి, రఘురాం, ఉదయ్‌సింగ్, జి.వి.పద్మజ, ఆర్‌.చైతన్య. 

మరిన్ని వార్తలు