పాఠశాల వ్యాన్‌ డ్రైవర్‌కు గుండెపోటు

26 Apr, 2019 10:18 IST|Sakshi
గోడను ఢీకొన్న వ్యాన్‌ (ఇన్‌సెట్‌) మృతి చెందిన మోహన్‌రాజ్‌ (ఫైల్‌)

21 మంది విద్యార్థులను రక్షించి డ్రైవర్‌మృతి

అన్నానగర్‌: విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతుండగా గుండెపోటుకు గురై వ్యాన్‌ డ్రైవర్‌ మృతిచెందాడు. ఆరుముగనేరిలో బుధవారం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతుండగా వ్యాన్‌ డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు ఏర్పడింది.అతడు వ్యాన్‌ వేగాన్ని తగ్గించడంతో అక్కడున్న ఇంటి ప్రహరీ గోడను ఢీకొని వ్యాన్‌ ఆగింది. వ్యాన్‌లో ఉన్న 21 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం వ్యాన్‌ డ్రైవర్‌ మృతిచెందాడు. తూత్తుక్కుడి జిల్లా ఆత్తూర్‌–పున్నక్కాయల్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన మోహన్‌రాజ్‌ (45). ఇతను ఆరుముగనేరిలో ప్రైవేట్‌ పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం పాఠశాల వ్యాన్‌లో విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళుతున్నాడు. వ్యాన్‌లో 21 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు.

ఆరుముగనేరి బజార్‌ దాటి రామరాజపురం ప్రాంతంలో వెళుతుండగా హఠాత్తుగా మోహన్‌రాజ్‌కి గుండెపోటు ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన మోహన్‌రాజ్‌ వ్యాన్‌ పేగాన్ని తగ్గించి, ఎడమ వైపుగా వ్యాన్‌ని తిప్పిన స్థితిలో స్టేరింగ్‌పై కుప్పకూలిపోయాడు. వ్యాన్‌ నేరుగా రోడ్డు పక్కనున్న ఇంటి ప్రహరీ గోడను ఢీకొని ఆగింది. వ్యాన్‌లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడ్డారు. స్పృహతప్పిన మోహన్‌రాజ్‌ను స్థానికులు తిరుచెందూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మోహన్‌రాజ్‌ అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు