ఫేస్‌బుక్‌ ప్రేమతో తంటా

29 Aug, 2019 09:02 IST|Sakshi

విమానమెక్కి భోపాల్‌ వెళ్లిన బెంగళూరు బాలిక  

పోలీసుల కౌన్సెలింగ్‌  

క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత

కర్ణాటక, యశవంతపుర: సోషల్‌ మీడియా ప్రేమలు ముక్కుపచ్చలారని బాలలను ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో మరోసారి వెల్లడైంది. సిలికాన్‌ సిటిలో 10వ తరగతి బాలిక ఒకరు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన స్నేహితున్ని వెతుకుతూ విమానం ఎక్కి రాష్ట్రాలు దాటి వెళ్లింది.  అతడు కూడా మైనర్‌ దాటని బాలుడే కావడం గమనార్హం. చివరకు శిశు సంక్షేమ అధికారులు, పోలీసులు బాలికకు నచ్చజెప్పి బెంగళూరుకు తీసుకురావడంతో సుఖాంతమైంది. 

ఏం జరిగిందంటే  
వివరాలు.. బెంగళూరులో ఓ ధనవంతుని కుమార్తె కార్పొరేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌లో తరచూ సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండేది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు చెందిన ఒక కుర్రవానితో ఫేస్‌బుక్‌లో పరిచయం కుదిరింది. ఇద్దరూ ఫోన్‌ నంబర్లు తీసుకుని తరచూ మాట్లాడేవారు. ప్రేమలో పడినట్లు కూడా సమాచారం. ఈ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియటంతో బాలికను మందలించారు. ఒకవైపు తల్లిదండ్రు లు ఆగ్రహించడం, మరోవైపు ప్రియున్ని కలవాలన్న భావనలో ఆ బాలిక బెంగళూరు విమానశ్రయం నుండి విమానంలో భోపాల్‌కు వెళ్లిపోయింది. భోపాల్‌లోని ప్రేమికుని ఇంటికి వెళ్లింది. ఇంట్లో వారు చూస్తే గొడవ అవుతుందని ఆ అబ్బాయి బాలికను ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. ఇంతదూరం ఎందుకు వచ్చావంటూ బుద్ధిమాటలు చెప్పి బెంగళూరుకు వెళ్లాలని సూచించాడు. ఇందుకు బాలిక ససేమిరా అంది. తాను ఇక్కడే ఉంటానని బాలిక మారాం చేయడంతో ఇద్దరి మధ్య గలాటా జరిగింది. 

బాలికకు కౌన్సెలింగ్‌  
ఇంతలో బాలిక మిస్సయిన సంగతి తెలిసి ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు విచారణ జరిపి భోపాల్‌లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు గాలించి మైనర్‌ ప్రేమజంటను  పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాలల సంరక్షణ సమితి ఆ బాలికకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఫేస్‌బుక్‌ స్నేహితున్ని కసిసేందుకు వచ్చినట్లు ఆమె తెలిపింది. తండ్రితో గొడవపడిన బాలిక కొద్దిరోజుల పాటు కాల్‌ సెంటర్‌లో పని చేసి వచ్చిన డబ్బులతో భోపాల్‌కు వెళ్లినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి బాలికను క్షేమంగా బెంగళూరుకు తీసుకొచ్చారు. 

మరిన్ని వార్తలు