స్టీరింగ్‌ విరిగి.. పక్కకు ఒరిగి

14 Nov, 2019 13:29 IST|Sakshi
ప్రమాదానికి గురైన స్కూల్‌ బస్సు

ప్రమాదానికి గురైన ప్రైవేటు స్కూల్‌ బస్సు

ఐదుగురు విద్యార్థులకు స్వల్పగాయాలు

కర్నూలు, ఆదోని రూరల్‌: మండల పరిధిలోని నెట్టేకల్‌ సమీపంలో ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. పట్టణంలోని శారదానికేతన్‌ పాఠశాలకు చెందిన బస్సు (ఏపీ21టీ జెడ్‌0898) బుధవారం డి.కోటకొండ, చిన్నపెండేకల్, సాంబగల్, నెట్టేకల్‌ గ్రామాలకు చెందిన 60 మందికి పైగా విద్యార్థులను తీసుకుని ఆదోనికి బయలుదేరింది. మార్గమధ్యంలోని నెట్టేకల్‌ సమీపంలో స్టీరింగ్‌ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి కొద్దిదూరం ముందుకెళ్లి ఓ పక్కకు ఒరిగింది. అందులో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. బస్సు ఆగిన స్థలానికి పది అడుగుల దూరంలోనే విద్యుత్‌ స్తంభం ఉంది. పొరపాటున దాన్ని ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి సంఘాల నాయకులు సంఘటన స్థలంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు