సైంటిస్ట్‌ హత్య కేసులో వీడని మిస్టరీ

3 Oct, 2019 10:26 IST|Sakshi
మృతుడు శ్రీధరణ్‌ సురేష్‌ (ఫైల్‌ ఫోటో)

అమీర్‌పేట: శాస్త్రవేత్త శ్రీధరన్‌ సురేష్‌ హత్య కేసులో మిస్టరీ  వీడలేదు. స్వలింగ సంపర్కమే ఈ హత్యకు దారి తీసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన సమయంలో  సురేష్‌ ఒంటిపై దుస్తులు లేకపోవడం, ఘటనా స్థలంలో ఓ ఆయిల్‌ బాటిల్‌ లభించడంతో అనుమానాలు బలపడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అమీర్‌పేటలోని విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేసే శ్రీనివాస్‌ గత రెండు నెలలుగా తరుచూ సురేష్‌ ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చి వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే శ్రీనివాసే హత్య చేశాడా లేక ఇతరుల పాత్ర  ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. కాగా శ్రీనివాస్‌ పరారీలో ఉన్నట్లు ఇన్స్‌పెక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. అయితే సురేష్‌ ఫ్లాట్‌కు చివరిసారిగా వాషింగ్‌ మెషిన్‌ మెకానిక్‌ వచ్చినట్లు తేలడంతో అతడి పాత్రపై కూడాఆరా తీస్తున్నారు.

భార్యకు మెసేజ్‌లు మాత్రమే...  
ఇండియన్‌ బ్యాంకులో పనిచేసే సురేష్‌ భార్య ఇందిర 2005లో బదిలీపై చెన్నై వెళ్లింది. అప్పటి నుంచి సురేష్‌ నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. కాగా భార్యా, భర్తల మధ్య గొడవలు  ఉన్నాయని, భార్యతో అతను సరిగా మాట్లాడే వాడు కాదని, ఏదైనా అవసరముంటే సెల్‌కు మెసేజ్‌లు మాత్రమే చేసేవాడని తెలిసింది. భార్యాభర్తల  మధ్య జరుగుతున్న గొడవలు హత్యకు దారి తీశాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు