పీఏసీఎల్‌ : ప్రముఖ గాయకుడికి సెబీ షాక్‌

11 Mar, 2020 20:59 IST|Sakshi
గాయకుడు సోనూ నిగం (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై: ప్రముఖగాయకుడు సోనూ నిగమ్‌కు మార్కెట్‌ రెగ్యులేటరీ సెబీ భారీ షాక్‌ ఇచ్చింది. వివాదాస్ప సంస్థ పెరల్స్‌ ఆగ్రోటెక్‌ కార్పొరేషన లిమిటెడ్‌ (పీఏసీఎల్‌) నుంచి కొనుగోలు చేసిన ముంబైకి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్జాత్‌లో నిగమ్‌  ఫామ్‌హౌస్‌ విక్రయంపై  నిషేధం విధించింది. అలాగే గత 18 సంవత్సరాలుగా  సమిష్టి పెట్టుబడి పథకాల ద్వారా పెట్టుబడిదారుల నుండి  అక్రమంగా రూ .60,000 కోట్లకు పైగా వసూలు చేసిన పీఏసీఎల్‌పై సెబీ అనేక ఆంక్షలు విధించింది. ఆస్తుల విక్రయం, బదిలీలకు అనుమతిని నిరాకరించింది. మహారాష్ట్రలోని కర్జాత్ ప్రాంతంలోని వ్యవసాయ భూముల విక్రయాన్ని లేదా బదిలీ చేయడాన్ని అడ్డుకుంటూ సెబీ ఉత్తర్వులు జారీచేసింది.  అలాగే సోనూ నిగం​తోపాటు వైటల్ సీ మార్కెటింగ్కు చెందిన  స్థిర, చర ఆస్తుల పూర్తి వివరాలను రెండు వారాల్లో అందించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్చి 9 తేదీన ఆదేశించింది.

పీఏసీఎల్‌ ఆస్తులను విక్రయించడానికి మరియు అమ్మకపు ఆదాయాన్ని పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించడానికి అప్పగించిన పీఏసీఎల్‌ కమిటీకి, జనవరి 15, 2018న  ఫాం హౌస్‌ను సోనూ నిగమ్‌ కొనుగోలు చేసిన వివరాలపై కమిటీకి తెలియజేస్తూ జాన్ కల్యాణ్ ట్రస్ట్ ఏప్రిల్ 2018 లో ఒక లేఖ  రాసింది.  పీఏసీఎల్‌ అనుబంధ సంస్ధ వైటల్ సీ మార్కెటింగ్ నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపింది. అయితే 99 శాతానికి పైగా  మూలధనం వాటా నేరుగా దాని 21 అసోసియేట్ కంపెనీలు నియంత్రిస్తాయని  పీఏసీఎల్‌  2018 మేలో  ప‍్రత్ర్యేక కమిటీకి అందించిన సమాచారంలో తెలిపింది. దీని ప్రకారం, తమ అసోసియేట్ సంస్థ వైటల్ సీ మార్కెటింగ్ ఆస్తులను  ఎటాచ్‌ చేయాలని సెబీని కోరింది.

కాగా వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరిట ప్రజల నుంచి పీఏసీఎల్‌ అక్రమంగా రూ. 60వేల  కోట్లు సమీకరించిందని తేలిన నేపథ్యంలో ఆగస్టు 22, 2014 నాటి ఉత్తర్వులలో డబ్బును తిరిగి చెల్లించాలని  పీఏసీఎల్‌,  దాని ప్రమోటర్లు డైరెక్టర్లను సెబీ  ఆదేశించింది. అయితే  డబ్బు తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు పీఏసీఎల్, దాని తొమ్మిదిమంది ప్రమోటర్లు, డైరెక్టర్ల  అన్ని ఆస్తులను అటాచ్ చేయాలని 2015 డిసెంబర్‌లో ఆదేశించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కూడా సంస్థ ఆస్తులను విక్రయించి ఆ నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది. ఇందుకోసం రిటైర్డ్ జస్టిస్ ఆర్‌ఎం లోధా సారథ్యంలో సెబీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సంగతి తెలిసిందే.

చదవండి: డెక్కన్‌ క్రానికల్‌ చైర్మన్‌పై సెబీ నిషేధం

మరిన్ని వార్తలు