డైరెక్ట్‌గా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..

20 Jul, 2019 15:43 IST|Sakshi

ముంబై : రోగాలు నయం చేస్తా, కుటుంబ సభ్యుల చిక్కులన్ని తొలగిస్తానంటూ ఓ మహిళను నమ్మించి రూ. 12.75లక్షలు దోచుకెళ్లిందో దొంగ సన్యాసిని. అంతేకాకుండా షిరిడి బాబాతో మాట్లాడి సమస్యలన్ని తీరుస్తానంటూ పూజ పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా మోసాన్ని గమనించిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ స్వయం ప్రకటిత సన్యాసిని జైలుపాలయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన కిరణ్ దారువాలా అలియాస్‌ గురుమ తనకు తాను దైవాంశ సంభుతురాలికిగా ప్రకటించుకొని అమాయక ప్రజలకు మోసం చేస్తుండేది. నగరంలోని ఖార్‌ పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ 34 ఏళ్ల మహిళ ఇటీవల ఆ సన్యాసిని సంప్రదించింది. తన అత్తగారి ఆరోగ్యం బాగాలేదని, అలాగే ఇంట్లో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని తొలగించాలని ఆ సన్యాసికి కోరింది. బాదిత మహిళ బలహీనతల్ని ఆసరా చేసుకున్న దొంగ సన్యాసిని.. తన దైవ శక్తులతో అన్ని సమస్యలను తొలగిస్తానని నమ్మపలికింది. షిరిడి బాబాతో నేరుగా మాట్లాడి సమస్యలను తొలగిస్తానని నమ్మించిది. గత జన్మలో సదరు మహిళ, ఆమె  భర్త  పాపాలు చేశారని, దాని ఫలితంగానే ఇప్పుడు సమస్యలు వచ్చాయని మాయమాటలుతో నమ్మపలికింది. అవన్నీ తొలగిపోవాలంటే పూజలు చేయాలని, దానికి ఖర్చు అవుతుందని మొత్తంగా రూ. 12.75లక్షలు రాబట్టింది. మరోవైపు పూజ పేరుతో మహిళపై సన్యాసిని లైంగికదాడికి పాల్పడింది. చివరకు ఆమె మోసాన్ని గమనించిన మహిళ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్‌ దారువాలను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు