ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌

23 Jul, 2019 13:17 IST|Sakshi
వేపగుంటలోని కృష్ణమాచార్యులు ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ సీఐ అప్పారావు

రూ.15 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన కృష్ణమాచార్యులు

సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఆలయ పరిసరాల్లో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహణకు తాళాలిచ్చేందుకు రూ.15వేలు డిమాండ్‌ చేసిన దేవదాయ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం... అక్కయ్యపాలెంకు చెందిన బి.శేషానంద్‌ 2017లో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహణ కోసం ఆలయ పరిసరాల్లోని షాపు అద్దెకు తీసుకుని 2018 వరకు నడిపించాడు. అనంతరం అతని భార్య అనారోగ్యానికి గురికావడంతో కొద్దికాలంగా షాపు తీయలేదు. మరలా ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి వరకు ఆలయానికి ఉన్న అద్దె బకాయి తీర్చేశాడు. అలాగే టిఫిన్‌ షాపు నిర్వహణకు షెడ్‌ తాళాలు ఇవ్వాలని కోరాడు. అయితే సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణామాచార్యులు షెడ్‌కు సంబంధించి తాళాలు ఇవ్వాలంటే రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో శేషానంద్‌ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు డబ్బులు ఇస్తానని సీనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణమాచార్యులను షాపు వద్దకు సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో పిలిచాడు. కృష్ణమాచార్యులు డబ్బులు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని, రూ.15 వేలు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేశారు. ఆలయంలోని పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వేపగుంటలోని కృష్ణమాచార్యులు ఇంటిలో ఏసీబీ సీఐ అప్పారావు సోదాలు చేశారు. సోదాల్లో సీఐలు గణేష్, అప్పారావు, రమేష్, గఫూర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు