భువనేశ్వర్ : సీనియర్ పాత్రికేయుడు చంద్రభాను పట్నాయక్ (60) కన్నుమూశారు. ఆయన స్థానిక ప్రముఖ దిన పత్రికలు సమాజ్, సమయ్ సంపాదకులుగా పనిచేశారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి స్థానిక స్పర్శ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.
పూరీ స్వర్గ ద్వార్ సముదాయంలో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పాత్రికేయ రంగంలో విశేష అనుభవం కలిగిన చంద్రభాను పట్నాయక్ రాజకీయ విశ్లేషకులుగా పేరొందారు. ఆంగ్లంలో పట్టభద్రుడైన ఆయన స్థానిక ఏకామ్ర కళాశాలలో అధ్యాపకుడిగా కొద్దికాలం పనిచేశారు. అనంతరం పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టారు. స్థానిక ఒడియా దినపత్రిక ప్రగతివాదిలో తొలుత పాత్రికేయునిగా జీవితం ప్రారంభించారు. తదుపరి ప్రతిష్టాత్మక సంబాద్, సమయ్, ఎస్టీవీ చానల్ సంపాదకుడిగా వ్యవహరించారు. ఒడియా కళలు, సంస్కృతి, సాహిత్యంపట్ల ఆయన గట్టి పట్టు సాధించారు.