ఓన్లీ ఇన్‌ కమింగ్‌..!

26 Dec, 2017 10:38 IST|Sakshi

సాంకేతికంగా సాగుతున్న రూటింగ్‌ వ్యవహారం

ప్రధాన సూత్రధారులు అంతా విదేశాల్లోనే

సాక్షి, సిటీబ్యూరో: హైటెక్‌ పద్దతిలో ఇంటర్నేషనల్‌ కాల్స్‌ని వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్‌ (వీఓఐపీ) పద్దతిలో లోకల్‌ కాల్స్‌గా మార్చే కాల్‌ రూటింగ్‌ ఎక్స్‌ఛేంజ్‌లు ఇక్కడి కాల్స్‌ను (ఔట్‌ గోయింగ్‌) బయటి దేశాలకు పంపలేవు. కేవలం ఆయా దేశాల నుంచి వచ్చే వాటి మాత్రమే లోకల్‌ కాల్స్‌గా మార్చి ఇక్కడి వారికి (ఇన్‌కమింగ్‌) అందించగలవు. నగరంలోని మూడు చోట్ల అక్రమ ఎక్ఛ్సేంజ్‌లు ఏర్పాటు చేసి, రూటింగ్‌కు పాల్పడుతున్న ముఠాను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం విదితమే. 

ఆ మొత్తం ఎగ్గొట్టడానికే...
విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్‌ కాల్‌ అక్కడి ఎక్స్‌ఛేంజి నుంచి నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్‌ గేట్‌ వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ లేదా శాటిలైట్‌ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడకు చేరిన ఫోన్‌కాల్‌ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్, బీఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్‌ రిసీవ్‌ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్, బీఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్ఛ్సేంజ్‌లు సైతం విదేశీ కాల్‌ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకోవడానికి అక్కడి కాల్‌ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి.

ఈ నేపథ్యంలోనే సూత్రధారులంతూ విదేశాల్లోనే ఉంటారు. కొందరు సూత్రధారులు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్‌ రూటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్‌ విదేశాలకు వెళ్ళాలంటే (ఔట్‌ గోయింగ్‌) కచ్చితంగా అది సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్‌ కాల్‌ పైనా ఏజెన్సీల నిఘా ఉంటుంది. అనునుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నెంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్‌ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు దేశలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్లకు ఉంటుంది. వారికి చిక్కకుండా హైటెక్‌ పద్దతిలో ఇంటర్నేషనల్‌ కాల్స్‌ని వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్‌ పద్దతిలో లోకల్‌ కాల్స్‌గా మారుస్తుంటారు.  

రూటింగ్‌ జరిగేది ఇలా...
విదేశీ ఆపరేటర్లు ఇక్కడి ఏజెన్సీలకు డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించే విధంగా ఓ విధానాన్ని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొంత మందికి ఇంటర్‌నెట్‌ ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తారు. అలా ఏర్పాటయిన తరవాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్‌ కాల్‌ అక్కడ డేటాగా మారిపోతుంది. దాన్ని ఇంటర్‌నెట్‌ ద్వారా నేరుగా ఇక్కడి వారిని ఎరవేసి ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే గేట్‌వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్‌ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్‌) బోగస్‌ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులను సేకరించి ఈ సీడీఎమ్‌ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్‌ లోకల్‌గా మారిపోయి ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డునకు చెందిన నెంబరు (లోకల్‌) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్‌ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్‌ఛార్జ్‌ తగ్గుతుంది. దేశంలోని అనేక ఆపరేటర్లను రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను దెబ్బతింటున్నాయి. 

ఈ కారణంగానే ప్రాధాన్యం...
ఆదివారం సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసిన ముఠాకు సంబంధించిన సమాచారం వారికి నిఘా వర్గాల నుంచి అందింది. పాక్‌ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారుల్ని ట్రాప్‌ చేయడానికి చూస్తుంటాయి. దీనికోసం వారు ‘హనీ ట్రాప్‌’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకుంటారు.అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలను, సమాచారం చూపి స్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్‌ మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్‌ చేయడానికి కాల్‌ రూటింగ్‌ విధానాన్నే వినియోగిస్తారు.

మరిన్ని వార్తలు