నగ్న చిత్రాల కేసులో మరో ఏడుగురి అరెస్ట్‌

7 Jul, 2020 06:48 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి. పక్కన అడిషనల్‌ ఎస్పీ గంగాధర్, డీఎస్పీ లక్ష్మీనారాయణ

ఫేక్‌ అకౌంట్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో 

ఛేదించిన పోలీసులు ∙నిందితులపై రౌడీషీట్లు

గుంటూరు ఈస్ట్‌: ఇంజనీరింగ్‌ విద్యార్థిని నగ్న చిత్రాలను ‘ఐయామ్‌ 420’ పేరుతో ఇన్‌స్ట్ర్రాగామ్‌లో అప్‌లోడ్‌ చేసి.. ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసిన ఘటనలో మరో ఏడుగురు నిందితులను గుంటూరు అర్బన్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులైన వరుణ్, కౌశిక్‌లను జూన్‌ 27వ తేదీ అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పక్కా ఆధారాలు సేకరించి మిగిలిన నిందితుల్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి సోమవారం వెల్లడించారు. (విద్యార్థిని నగ్న చిత్రాల కేసు: ఏడుగురు అరెస్ట్‌)

‘ప్రేమ’ వల వేసి..
ఓ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన వరుణ్‌ అనే విద్యార్థి ప్రేమ పేరుతో వలవేసి తన సహ విద్యార్థినిని వంచించాడు. ఆమె నగ్న వీడియో చిత్రీకరించి.. ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడంతోపాటు తోటి విద్యార్థులకు ఫార్వార్డ్‌ చేశాడు. 
రెండో నిందితుడైన కౌశిక్‌ ద్వారా ఆ విద్యార్థిని నగ్న చిత్రాలు భాస్కర్, అతని ద్వారా ధనుంజయరెడ్డి, అతని నుంచి మణికంఠ, తులసీకృష్ణ, వారి నుంచి కేశవ్, క్రాంతి కిరణ్, రోహిత్‌ అనే విద్యార్థులకు చేరాయి. 
వీరిలో మణికంఠ, ధనుంజయరెడ్డి వాటిని ఆ యువతికి పంపి.. ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. మిగిలిన ఐదుగురికి ఇదే విషయం చెప్పడంతో వాళ్లు కూడా ఆమెను లొంగదీసుకునే 
ప్రయత్నం చేశారు. 
వారిలో మణికంఠ అనే విద్యార్థి‘ఐయామ్‌ 420’ అనే పేరిట ఫేక్‌ అకౌంట్‌ తెరిచి ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా ఆ యువతికి చెందిన నగ్న చిత్రాలను ఆమెకే పంపి చాటింగ్‌ చేశాడు. 
 ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.50 వేల నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. బాధితురాలు అతడి బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు పంపాల్సిందిగా కోరగా.. నిందితులు దొరికిపోతామన్న భయంతో అకౌంట్‌ నంబర్‌ పంపకుండా మిన్నకుండిపోయారు. 
ఆ యువత ధైర్యం చేసి తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పక్కా సాంకేతిక ఆధారాలతో ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసి ల్యాప్‌టాప్, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఫేక్‌ అకౌంట్‌ను ఛేదించడం, సాంకేతిక ఆధారాలను సేకరించడంలో అర్బన్‌ టెక్నికల్‌ అనాలసిస్‌ టీమ్‌ ఇన్‌చార్జి విశ్వనాథరెడ్డి, సాంకేతిక సిబ్బంది విశేష కృషి చేశారని ఎస్పీ చెప్పారు.
నిందితులపై రౌడీషీట్లు తెరుస్తామని ఎస్పీ తెలిపారు.
దీనివల్ల వారిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. కేసును ఛేదించేందుకు కృషి చేసిన దిశ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలు కోటయ్య, బాజీ బాబులను ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. 

మరిన్ని వార్తలు