ఇంజక్షన్‌ వికటించి ఏడు నెలల బాబు మృతి

23 Aug, 2019 10:10 IST|Sakshi
రుత్విక్‌ మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబీకులు

సాక్షి, కరీమాబాద్‌ (వరంగల్‌): నగరంలోని రంగశాయిపేటలోని ఓ పిల్లల ఆస్పత్రిలో ఇంజక్షన్‌ వికటించి ఏడు నెలల బాబు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన వర్కాల మమత, రత్నాకర్‌ దంపతులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్న తమ ఏడు నెలల బాబు (రుత్విక్‌)ను తీసుకుని రంగశాయిపేట కార్తీకేయ పిల్లల దవాఖానకు వచ్చారు. అక్కడ డాక్టర్‌ దయానందసాగర్‌ ఉదయం 11.30 ఇంజక్షన్‌ వేసి పంపించారు. అయితే కొంతసేపటి తర్వాత బాబు రుత్విక్‌ తీవ్ర అస్వస్తతకు గురికావడంతో తిరిగి ఆస్పత్రి వరకు తీసుకుకావడంలోపే మృతి చెందాడు. దీంతో డాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడంటూ బాబు తల్లిదండ్రులు, బంధువులు  ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని బాబు మృత దేహాన్ని ఎంజీఎంకు తరలించారు. అలాగే డాక్టర్‌ దయానందసాగర్‌ను మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇందులో నా తప్పు లేదు..
ఈ నెల 21 జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఏడు నెలల బాబును తీసుకుని నా వద్దకు వచ్చారు. నేను ఆ రోజు కావాల్సిన సిరప్‌ మందులు రాసి ఇచ్చి పంపించారు. తగ్గక పోతే మళ్లీ రమ్మన్నాను. వారు గురువారం ఉదయం 11.30 గంటలకు రాగానే ఓఆర్‌ఎస్‌తో పాటు అమికాషన్‌ ఇంజక్షన్‌ ఇచ్చి పంపిచాను. వెళ్లిపోయిన వారు మళ్లీ మధ్యాహ్నం 1.30 గంటలకు వచ్చారు. అప్పటికే బాబు మృతి చెందాడు. ఇందులో నా తప్పేమి లేదు. నేను సరిగానే ట్రీట్‌మెంట్‌ చేశా.
– దయానందసాగర్, వైద్యుడు

మరిన్ని వార్తలు