దారుణం : బాలికపై లైంగిక దాడి

3 Nov, 2019 07:57 IST|Sakshi

సాక్షి, తొండంగి (తుని): అన్నెం పున్నెం ఎరుగని ఏడేళ్ల బాలికను చాక్లెట్లు కొంటానని చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన ఏడేళ్ల బాలిక గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. సుమారు వారం రోజుల క్రితం ఇంటి వద్ద రామాలయంలో పిల్లలతో ఆడుకుంటుండగా ఇదే గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలుడు సైకిల్‌పై వచ్చి బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు కొంటానని నమ్మబలికి ఎవరూలేని పాఠశాల ప్రాంగణ భవనంలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు.

భయంతో ఇంటికెళ్లిన బాలిక ముభావంగా ఉండడంతో తల్లికి అనుమానం వచ్చి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు తుని ఏరియా ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకెళ్లగా ఎంఎల్‌సీ కేసు నమోదు చేసిన తర్వాతే వైద్యం అందిస్తామన్నారని బాలిక తల్లి వాపోయింది. ఈ సంఘటనపై గ్రామ పెద్దల్లో పంచాయతీ పెట్టగా బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడని స్థానికులు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగికదాడికి పాల్పడిన బాలుడిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పోలీస్‌స్టేషన్‌ వద్ద దానవాయిపేట గ్రామస్తులు ఆందోళనకు చేశారు. బాలుడిపై కేసు నమోదు చేసి, వారిని వైద్య పరీక్షలకు పంపామని తొండంగి ఎస్సై సీహెచ్‌.గోపాలకృష్ణ తెలిపారు. 

మరిన్ని వార్తలు