పోలీసులకు లైంగిక సామర్థ్య పరీక్షలు

20 Nov, 2018 12:51 IST|Sakshi

వాకపల్లి గిరిజన మహిళలపై లైంగిక దాడి కేసులో కోర్టు ఆదేశం

విశాఖ లీగల్‌: వాకపల్లి గిరిజన మహిళలపై లైంగిక దాడి కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్న 13 మంది పోలీసు సిబ్బందికి లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహించాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 30తేదీలోపు ఆ ప్రక్రియ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వెంకటనాగేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కేసును ఈనెల 30కి వాయిదా వేశారు. 2008 ఆగస్టు 21న కొంతమంది గ్రేహౌండ్‌ పోలీసులు తనిఖీల నెపంతో విశాఖ జిల్లా గిరిజన ప్రాంతమైన జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంపై దాడి చేశారు. ఆ సమయంలో కొంతమంది గిరిజన మహిళలపై లైంగికి దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది.

ఈ కేసు పలు మలుపులు తిరిగి చివరికి విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కోర్టుకు విచారణకు వచ్చింది. గిరిజన మహిళల అభ్యర్థన మేరకు హైకోర్టు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా రాజేంద్రప్రసాద్‌ను నియమించింది. అయితే పోలీసులు తమకు సంబంధం లేదని, ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లో ఫోర్స్‌నిక్‌ డిపార్టుమెంట్‌ జారీ చేసిన ఒక లేఖను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో నిందితులైన పోలీసులకు లైంగిక సామర్థ్య పరీక్షలు జరపాలని ప్రాసిక్యూషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. 13 మంది పోలీసులకు పరీక్షలు నిర్వహించాలని ఆ రిపోర్టును ఈనెల 30లోపు కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు