వివాహితపై లైంగికదాడి ?

27 Feb, 2018 13:16 IST|Sakshi

స్పృహ కోల్పోయి ఎంజీఎంలో చికిత్స

వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు

దుగ్గొండి( దుగ్గొండి): పంట చేను వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై  ఓ వ్యక్తి లైంగికదాడికి యత్నించగా ఆమె స్పృహ కోల్పోయిన సంఘటన మండలంలోని తొగర్రాయి గ్రామంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 35 సంవత్సరాల వివాహిత ఆదివారం ఇదేగ్రామానికి చెందిన ఓ రైతు పంట చేను వద్ద పనులు చేయడానికి వెళ్లింది. సదరు మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సదరు మహిళ స్పృహ కోల్పోయినట్లు సమాచారం. రాత్రి 7 గంటలు దాటిన అనంతరం గమనించిన వ్య క్తులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

అయితే మహిళను కొట్టారా లేక సామూహికంగా కొంతమంది లైంగికదాడికి యత్నించారా అనే విషయాలు తెలియరాలేదు. అయితే ఈ విషయమై ఎస్సై  భాస్కర్‌రెడ్డిని వివరణ కోరగా అపస్మారక స్థితిలో ఉన్న మహిళను కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఆదివారం రాత్రి పొద్దుపోయాక వైద్యులు తమకు సమాచారం ఇచ్చారన్నారు. దీంతో వెంటనే బాధితురాలి వద్దకు వెళ్లామని, అయితే  సదరు మహిళ స్పృహలో లేకపోవడంతో ఏం జరిగిందో తెలియడం లేదన్నారు. మహిళ స్పృహలోకి వస్తే కొట్టిగాయపరిచారా.. లేక లైంగికదాడి చేశారా అనే విషయాలు తెలుస్తాయన్నారు. బాధితురాలి పక్షాన ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. అయితే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశంతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు