వివాహితపై లైంగిక వేధింపులు

11 Feb, 2019 11:29 IST|Sakshi

ప్రశ్నించిన భర్తపై దాడి

జిల్లా ఎస్పీకి బాధితుల ఫిర్యాదు

కేసు నమోదు చేసిన పోలీసులు

చిత్తూరు , రొంపిచెర్ల: వివాహితపై ఒక యువకుడు లైంగిక వేధింపులకు దిగాడు. దీనిపై ప్రశ్నించిన వివాహిత భర్తపై దాడి చేశాడు. ఈ సంఘటన రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల పంచాయతీ కస్సాపేటలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. కస్సాపేటలో రేష్మ(22)కు నియాజ్‌ దంపతులు ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఇన్ను (22) అనే యువకుడు రెండు నెలలుగా రేష్మను లైంగికంగా వేధిస్తున్నాడు.

ఆమె విషయాన్ని భర్తకు చెప్పింది. నియాజ్‌ ఆ యువకుడిని మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన ఇన్ను తన సేహ్నితుడు ఖాదర్‌బాషతో కలిసి రేష్మ భర్త నియాజ్‌పై దాడి చేశాడు. తనకు రాజకీయ నాయకుల అండ ఉందని, తనను ఎవరు ఏమీ చేయలేరని రేష్మతో చెప్పాడు. తన మాట వినకుంటే భర్తను చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.

తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. దీనిపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ రొంపిచెర్ల ఎస్‌ఐ ప్రసాద్‌ను ఆదేశించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు