లైంగిక వేధింపుల కేసులో డీసీపీఓ అరెస్ట్‌

25 Jun, 2018 16:16 IST|Sakshi

సాక్షి, పట్నా : బిహార్‌ ప్రభుత్వంతో కలిసి ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించే బాలల సదనంలో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ముజఫర్‌పూర్‌ జిల్లా బాలల రక్షణాధికారి (డీసీపీఓ)ని అరెస్ట్‌ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వెంటనే సదనంలో ఉన్న 44 మంది బాలికలను వేరే ప్రాంతానికి తరలించారు. బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ఇప్పటివరకూ పది మందిని అరెస్ట్‌ చేశారు. బాధిత బాలికల ఫిర్యాదు మేరకు డీసీపీఓ రవి రోషన్‌ను ఆయన నివాసం నుంచి అరెస్ట్‌ చేశామని ముజఫర్‌ పూర్‌ ఎస్పీ హర్పీత్‌ కౌర్‌ వెల్లడించారు.

సాంఘిక సంక్షేమ శాఖ చేపట్టిన అంతర్గత విచారణలోనూ నేరంలో డీసీపీఓ పాత్ర ఉన్నట్టు తేలింది. అయితే తనను ఈ కేసులో బలిపశువును చేవారని, తాను ఎప్పుడు బాలికల సదనాన్ని సందర్శించినా సాంఘిక సంక్షేమ శాఖ బృందం తన వెంట ఉండేదని డీసీపీఓ పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో బాలల సంక్షేమ కమిటీ సభ్యుడితో పాటు, సదనం ఉద్యోగులున్నారని పోలీసులు తెలిపారు. కేసులో నిందితులపై పోస్కో చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు. సదనంలో నిర్వాహకులు తమను లైంగిక వేధింపులకు గురిచేశారని సాంఘిక సంక్షేమ శాఖ చేపట్టిన అంతర్గత విచారణలో బాలికలు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు