శిరీష మరొకరికి దక్కకూడదనే హతమార్చాడు..

11 May, 2018 15:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి రిసార్ట్‌లో దారుణ హత్యకు గురైన డిగ్రీ విద్యార్థిని శిరీష కేసు వివరాలను శంషాబాద్‌ డీసీపీ పద్మజ మీడియాకు వివరించారు. తనకు దక్కని శిరీష ఇంకెవరికీ దక్కకూడదనే కోపంతోనే సాయిప్రసాద్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు  తెలిపారు. చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆమె ప్రెస్‌మీట్‌లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

‘శిరీష పదో తేదీ ఉదయం 11 గంటలకు కోచింగ్‌కు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. ఆమె దిల్‌సుఖ్‌నగర్‌లోని టైమ్స్‌ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకుంటోంది. సాయిప్రసాద్‌ ఆమెతో మాట్లాడాలి అని చెప్పి శంషాబాద్‌కు రావాలని ఫోన్‌ చేశాడు. అదే సమయంలో అతడు... ప్రగతి రిసార్ట్స్‌లో ఆన్‌లైన్‌లో కాటేజ్‌ బుక్‌ చేసి ఆమెను నేరుగా రిసార్ట్స్‌కు తీసుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో నిన్న శిరీషను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసాడు. బాత్రూమ్‌కు వెళ్లిన ఆమెపై వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు.

నిందితుడు సాయిప్రసాద్‌ కొత్తూరులోని ఎన్‌టీడీఎఫ్‌ కళాశాలలో డిప్లొమా చేసి ఉద్యోగ ప్రయాత్నాలు చేస్తున్నాడు. గత అయిదేళ్లగా ప్రేమ పేరుతో శిరీష వెంట పడుతూ, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. గత రాత్రే సాయిప్రసాద్‌ను చిలుకూరు బాలజీ టెంపుల్‌ వద్ద ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతోనే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. శిరీష, సాయిప్రసాద్‌ శంషాబాద్‌లో ఇంటర్మీడియెట్‌ ఒకే కాలేజీలో చదివారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.’ అని తెలిపారు. శిరీష మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడి అవుతాయని ఆమె తెలిపారు.

 శిరీష హత్య కేసు వివరాలను వెల్లడించిన డీసీపీ పద్మజ

చదవండి....
రిసార్ట్‌లో దారుణం: అత్యాచారం చేసి.. ఆపై గొంతుకోసి 

మరిన్ని వార్తలు