పీటర్‌ ముఖర్జీకి బెయిల్‌

7 Feb, 2020 09:27 IST|Sakshi

ముంబై: మాజీ మీడియా అధిపతి పీటర్‌ ముఖర్జీకి బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ముఖర్జీ బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ నితిన్‌ సంబ్రే గురువారం విచారణ చేపట్టారు. షీనా బోరా హత్య కేసులో పీటర్‌ ముఖర్జీకి ప్రమేయమున్నట్లు సీబీఐ ఎటువంటి ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొన్నారు. ముఖర్జీ తన పాస్‌పోర్టును సీబీఐకి అప్పగించడంతోపాటు రూ.2 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఈ కేసులో సాక్షులుగా ఉన్న తన కుమారుడు రాహుల్, కుమార్తె నిధితో మాట్లాడరాదని జస్టిస్‌ నితిన్‌ సంబ్రే స్పష్టం చేశారు.

ఈ విషయంలో సీబీఐ అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా బెయిల్‌ అమలుపై ఆరు వారాల స్టే విధించారు. షీనా బోరా హత్య కేసులో 2015లో అరెస్టయిన ముఖర్జీ అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. షీనా బోరా హత్య కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ కూడా 2015 నుంచి జైలులోనే ఉన్నారు.  (చదవండి: మహారాష్ట్రలో దిశ చట్టం!)

మరిన్ని వార్తలు