పెళ్లికి నిరాకరించాడని..

13 Apr, 2018 09:56 IST|Sakshi
ఆందోళన చేస్తున్న శిరీషారాణి

ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన

మారేడుపల్లి : ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమేగాక పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటిముందు ఓ యువతి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. వివరాల్లోకి వెళితే... కొండాపూర్‌కు చెందిన శిరీషారాణి (24) ఎంబీఏ పూర్తిచేసింది. గత ఏడాది వాట్సాప్‌లో మారేడుపల్లి శేషాచలం కాలనీకి చెందిన నక్కా నితిన్‌యాదవ్‌ ఫోన్‌కు ఆమె ఫోన్‌ నుంచి రాంగ్‌కాల్‌ వెళ్లింది. ఇలా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి తిరిగారు. మూడు నెలల క్రితం ఆమె పెళ్లి ప్రస్తావన తేగా నితిన్‌యాదవ్‌ అందుకు నిరాకరించాడు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి మారేడుపల్లిలోని నితిన్‌యాదవ్‌ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలని కోరారు.

అయినా నితిన్‌యాదవ్, అతని కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించడంతో మార్చి 14న మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించినా అతనిలో మార్పురాకపోవడంతో గత నెల 15న అరెస్టు చేసి  రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటికి వచ్చిన నితిన్‌తో తనకు వివాహం జరిపించాలని కోరుతూ బాధితురాలి బుధవారం రాత్రి నుంచి అతని ఇంటి వద్ద ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంది. గురువారం పలు మహిళాసంఘాల నేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు. నితిన్‌యాదవ్‌ ఇంటికి తాళంవేసి ఉండడంతో ఇంటివద్దనే టెంటువేసుకుని దీక్షను కొనసాగిస్తుంది. ఎన్నిరోజులైనా దీక్షను కొనసాగిస్తానని, అతనితోనే జీవితాంతం కలిసి ఉంటానని ఆమె పేర్కొంటుంది.

మరిన్ని వార్తలు