సాక్షి, విజయవాడ : కడుపు నొప్పి అని వెళ్లిన ఓ వ్యక్తికి మతిస్థిమితం కోల్పోయేలా చేశారు ఓ ప్రయివేట్ ఆసుపత్రి వైద్యులు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన బాజీ.. కడుపు నొప్పితో బాధపడుతూ ఓ ప్రయివేట్ ఆసుపత్రిని ఆశ్రయించాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈ నెల 26న ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఈ ఆపరేషన్ అనంతరం బాజీ మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాజీని పరిశీలించిన గుంటూరు వైద్యులు.. ఆపరేషన్ సమయంలో ఎనస్తీషియా ఎక్కువ కావడంతో అది మెదడు మీద ప్రభావం చూపిందని తెలిపారు. ప్రస్తుతం అతని పరస్థితి విషమించిందని, మరో ఆపరేషన్ చేయడానికి కుదరదని పేర్కొన్నారు. ఎనస్తీషియా డోస్ ఎక్కువ కావడంతోనే ఆపరేషన్ కష్టంగా మారిందన్నారు. దీనికి కారణమైన ఆ ప్రయివేట్ ఆసుపత్రి యాజమాన్యంపై బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.