మహిళకు మధ్య వేలు చూపించాడని..

21 Sep, 2019 18:16 IST|Sakshi

ఢిల్లీ : ఎదుటివారిని అవహేళన చేస్తూ మధ్య వేలును చూపించటమనేది పాశ్చాత్య దేశాల్లో కనిపించేదే. బండ బూతే అయినప్పటికీ ఆ సైగను అక్కడి ప్రజలు అంతగా పట్టించుకోరు కూడా. కానీ, మన దేశంలో అలా చేయడం నేరమని తీర్పునిచ్చింది ఢిల్లీ కోర్టు. ఓ మహిళకు మధ్యవేలు చూపించి జైలు శిక్షకు గురయ్యాడు ఓ ఢిల్లీ వ్యక్తి. 2014లో నమోదైన ఈ కేసుపై పలు వాదనల తర్వాత ఢిల్లీ కోర్టు ఇటీవల తీర్పు వెలువడించింది.

బాధిత మహిళ తనకు బావ వరసయ్యే వ్యక్తి మధ్య వేలు చూపించడమే కాకుండా అసభ్యకరంగా ముఖ కవలికలు చూపించి చెంపమీద కొట్టాడని 2014లో కేసు పెట్టారు. పోలీసులు నిందితునిపై సెక్షన్ 509, 323ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనిపై కోర్టు 2015 అక్టోబరు 8నాటికే తీర్పు వెలువరించింది. అయినప్పటికీ నిందితుడు తనపై మోపిన అభియోగం సరైంది కాదంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఆమెతో ఆస్తి విభేదాలు ఉండడంతో ఇలాంటి నిందలు వేస్తుందని అతను ఆరోపించాడు. ఢిల్లీ కోర్టు నిందితుడి చర్యలను హెచ్చరిస్తూ.. మహిళ మర్యాదకు భంగం కలిగించాడని తీర్పునిచ్చింది. నిందితుడికి జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

మరిన్ని వార్తలు