ఓ రిటైర్డ్‌ ఎస్‌ఐ దొంగ తెలివి

6 Oct, 2019 08:10 IST|Sakshi
ప్రధాన నిందితుడు రాజేందర్‌ సింగ్‌

నకిలీ పత్రాలు సృష్టించి తండ్రి ఆస్తి స్వాహా

సహకరించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి  

అమీర్‌పేట: నకిలీ పత్రాలు సృష్టించి తండ్రి సంతకాలను ఫోర్జరీ చేసి ఆస్తిని కాజేసిన ఓ రిటైర్డ్‌ ఎస్‌ఐతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ మాజీ ఉద్యోగిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ మహేందర్‌ తెలిపిన మేరకు.. అమీర్‌పేటకు చెందిన రిటైర్డ్‌ ఇన్స్‌పెక్టర్‌ పురంసింగ్‌కు నలుగురు కుమారులు. వీరిలో ముగ్గురు కుమారులైన రాజేందర్‌సింగ్, ఇందర్‌జీత్‌సింగ్, రజింత్‌సింగ్‌లు  తండ్రికి తెలియకుండా అమీర్‌పేటలో 150 గజాలు, నాందేడ్‌లో మరో 180 గజాల స్థలాన్ని కాజేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో ఎస్‌ఐగా పనిచేసిన రాజేందర్‌సింగ్‌ కీలకంగా వ్యవహరించారు. 1982లో రద్దయిన బాండ్‌ పేపర్‌పై 1994లో తండ్రి పురంసింగ్‌ రాసి ఇచ్చినట్లు వీలునామ రాయించి సాక్షిగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో పనిచేసే సుర్జిత్‌సింగ్‌ను పెట్టిపై రెండు స్థలాలను కాజేశారు.

తండ్రి సంపాదించిన ఆస్తి నలుగురికి సమానంగా రావాల్సి ఉండగా కేవలం నకిలీ నత్రాలు సృష్టించడమే కాకుండా సంతకాలు ఫోర్జరీ చేసి ముగ్గురే ఆస్తిని కాజేశారని గ్రహించిన పురంసింగ్‌ పెద్ద కుమారుడు జీవన్‌సింగ్‌ ఆధారాలు సేకరించి స్టాంపు పేపర్‌తో పాటు ఫోర్జరీ సంతకాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపగా  నకిలీవని తేల్చారు. దీని ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జీవన్‌సింగ్‌ కుమారుడు సర్ధార్‌ సురెందర్‌సింగ్‌ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి వివరాలు సేకరించిన పోలీసులు వాటిని  సిటీ సివిల్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు  చేశారు. కేసు పూర్వపరాపాలను పరిశీలించిన న్యాయమూర్తి ప్రధాన నింధితుడు రాజేందర్‌సింగ్, సాక్షి సుర్జిత్‌సింగ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ తీర్పు వెలువరించారు. తీర్పు అనంతరం వారిని శనివారం రిమాండ్‌కు తరళించామని ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు