ఘోర ప్రమాదం; అక్కాతమ్ముళ్ల దుర్మరణం

23 Jun, 2019 08:28 IST|Sakshi

బెంగళూరు : కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ బైక్‌ను ఢీకొన్న ఘటనలో అక్క, తమ్ముడు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన అనేకల్‌ తాలూకా సర్జాపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. అనేకల్‌ తాలూకా నెరిగా గ్రామం నివాసులయిన రత్నమ్మ(40), గిరీష్‌ (36) అక్కాతమ్ముళ్లు. ఇద్దరూ కూలీపని చేసి జీవించేవారు. విధుల్లో భాగంగా శనివారం దొమ్మసంద్ర వద్ద నెరిగా గేట్‌ వద్ద వీరు బైక్‌పై వస్తుండగా ఎదురుగా వచ్చిన ట్యాంకర్‌ ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అక్కాతమ్ముళ్లు తప్ప వీరికి కుటుంబ సభ్యులు, బంధువులు లేరు. దీంతో గ్రామస్తులే అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటనపై సర్జాపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు