అమెరికాలో మరో భారతీయుడి హత్య..!

17 Aug, 2018 13:02 IST|Sakshi
తెర్లోక్‌ సింగ్‌ (ఫైల్‌ ఫొటో)

మూడు వారాల్లో ముగ్గురు హతం

న్యూయార్క్‌ : అమెరికాలో సిక్కులపై మరో దాడి జరిగింది. ఓ సిక్కు వ్యక్తిపై కొందరు దుండగులు కత్తితో దాడి చేసి పొట్టనబెట్టుకున్నారు. గత మూడు వారాల్లో ఇది మూడో ఘటన. న్యూజెర్సీలో ఎసెక్స్‌ కౌంటీలో గురువారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. భారత్‌కు చెందిన తెర్లోక్‌ సింగ్‌ అనే వ్యక్తి స్థానికంగా ఒక కొట్టు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం స్టోర్‌ వద్దకు వెళ్లగా తెర్లోక్‌ చనిపోయి ఉన్నాడని అతని బంధువు వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామనీ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎసెక్స్‌ కౌంటి అధికారులు తెలిపారు. తెర్లోక్‌కు భార్యాపిల్లలు ఉన్నారు. 

మీ దేశం వెళ్లిపో...!
వారంక్రితం (ఆగస్టు 6) కూడా సిక్కు వ్యక్తిపై ఇలాంటి దాడే జరిగింది. కాలిఫోర్నియాలోని మాంటెకా కౌంటీలో సాహిబ్‌ సింగ్‌ (71) మార్నింగ్‌ వాక్‌కు వెళ్లొస్తుండా తైరోన్‌ మెక్‌అలిస్టర్‌ అనే వ్యక్తి కిరాతంగా హత్య చేశాడు. రెండు వారాల క్రితం (జూలై 31) సుర్జీత్‌ మహ్లీ(50)ని అనే సిక్కును ఓ దుండగుడు హత్య చేశాడు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన వ్యక్తికి సపోర్ట్‌ చేస్తున్నావంటూ సుర్జీత్‌ ట్రక్‌పై ‘మీ దేశానికి వెళ్లిపో’అంటూ హంతకుడు హెచ్చరికలు రాసినట్టు వెల్లడైంది.

కాగా, దాడులు జరగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న సిక్కులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ‘ఇక్కడ మన హక్కులు తెలుసుకోండి. మనతో దురుసుగా ప్రవర్తించేవారిని ఉపేక్షించొద్దు. వారిపై తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అని సిక్కు సంఘం నాయకులు అమృత్‌ కౌర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు