అవివాహిత ఆత్మహత్య

16 Apr, 2019 06:49 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడిన ప్రభావతి దాస్‌

మీర్‌పేట: ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డీఎంఆర్‌ఎల్‌లో శాస్త్రవేత్తగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన నిరంజన్‌దాస్‌  భార్యాబిడ్డలతో కలిసి మీర్‌పేట లెనిన్‌నగర్‌ అనూరాగ్‌నగర్‌ కాలనీలో ఉంటున్నారు. అతని సోదరి  ప్రభావతిదాస్‌ (41) అవివాహిత. గతంలో ఆమె ఢిల్లీలోని బ్రహ్మకుమారీస్‌ ఆశ్రమంలో ఉండేది. ఉద్యోగం కోసం గత కొన్ని రోజుల క్రితం నగరానికి వచ్చిన ప్రభావతిదాస్‌ అనూరాగ్‌కాలనీలోని సోదరుడు నిరంజన్‌దాస్‌ వద్దకు వచ్చి ఉంటోంది. నగరంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు కూడా హాజరైంది.

సదరు కంపెనీ వారు 15 రోజుల తరువాత చెబుతామని చెప్పడంతో ఆమె సోదరుని వద్దే ఉంటోంది. ఈ నెల 8వ తేదీన నిరంజన్‌దాస్‌ తన కుమారుణ్ని ఒరిస్సాలోని బంధువుల వద్దకు తీసుకవెళ్లేందుకు వెళ్లాడు.  ఆ సమయంలో ఇంట్లో ఆయన భార్య లక్ష్మీ ప్రియ దాస్, సోదరి ప్రభావతి దాస్‌ ఇద్దరే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం లక్ష్మీ ప్రియ దాస్‌ బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి బయటి నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా ప్రభావతి దాస్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, లక్ష్మీప్రియదాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు