చెన్నై,టీ.నగర్: నామక్కల్లో అక్కను హతమార్చిన చెల్లెలు, ఆమె ప్రియుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కోసవంపట్టి దేవేంద్రపురానికి చెందిన శంకరన్ కుమార్తె మోనిషా (18) నామక్కల్లో ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతోంది. ఈ నెల 4న ఇంట్లో ఒంటరిగా ఉన్న మోనిషా ఎడమచేతిని కత్తితో కోసుకున్న స్థితిలో పడివుండడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందింది. దీన్ని నామక్కల్ పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులమడంతో ఆమె చనిపోయినట్లు తెలిసింది.
దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో మోనిషాను ఆమె చెల్లెలు తన ప్రియుడు రాహుల్ (19)తో కలిసి హతమార్చినట్లు తెలిసింది. రాహుల్ ఆమెకు అన్న వరస అవుతాడు. దీన్ని మోనిషాతోపాటు ఇరు కుటుంబాల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆగ్రహించిన మోనిషా చెల్లెలు, తన ప్రియుడు రాహుల్తో కలిసి హతమార్చినట్లు తెలిసింది.