గుంటూరు, పేరుకలపూడి(దుగ్గిరాల): అక్క తన ప్రియుడితో వెళ్లిపోయిందన్న మనస్తాపంతో తమ్ముడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుగ్గిరాల మండలం పేరుకలపూడి గ్రామానికి చెందిన యువతి బీఫార్మసీ పూర్తి చేసి చినకాకానిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన ప్రేమించినవాడితో కలసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న యువతి పెదనాన్న కుమారుడు మేదర ప్రకాష్ (19) రెడ్డిపాలెం–నూతక్కి గ్రామాల మధ్య డొంక మార్గంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితునికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గుంటూరు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కుటుంబసభ్యులు అక్కడ నుండి నేరుగా తెనాలిలోని ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. మంగళవారం రాత్రి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ప్రకాష్ బాబాయి దానియేలు ఇచ్చినæ ఫిర్యాదుమేరకు ఏఎస్ఐ వై. అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.