-

ప్రాణాలు తీసిన సెప్టిక్‌ ట్యాంక్‌ : ఆరుగురు మృతి

10 Aug, 2018 16:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పాట్నా : నిర్మాణంలో ఉన్న సెప్టిక్‌ ట్యాంక్‌లోకి దిగి ఊపిరాడక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం బీహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బీహార్‌లోని చంపారన్‌ జిల్లాలోని జీత్‌పుర్‌కు చెందిన మోహన్‌ మహతో కొత్తగా ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయో తెలుసుకోవటానికి వెళ్లాడు. ఒక్కొక్కటిగా అన్నీ చూసుకుంటూ సెప్టిక్‌ ట్యాంక్‌ ఎలా కడుతున్నారో తెలుసుకోవటానికి లోపలికి దిగాడు. ఎంతసేపటికి మోహన్‌ బయటకు రాకపోవటంతో అతని తండ్రి, తల్లి, తమ్ముడు కూడా లోపలికి దిగారు.

వారు కూడా బయటకు రాకపోవటంతో మరో ఇద్దరు గ్రామస్తులు లోపలికి దిగారు. ఇలా మొత్తం ఆరు మంది లోపల ఊపిరాడక కోమాలోకి వెళ్లిపోయారు. ఆరుగురిని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. కోమాలోకి వెళ్లిన వెంటనే వారు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసు అధికారి అలోక్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించామని తెలిపారు. వారి మృతికి సంబంధించిన సరైన కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. పోస్ట్‌ మార్టమ్‌ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు.  
 

మరిన్ని వార్తలు