ఇటలీలో కాల్పులు.. ఆరుగురికి గాయాలు

4 Feb, 2018 03:23 IST|Sakshi

మిలాన్‌: ఇటలీలోని మాసెరాటా పట్టణంలో శనివారం ఓ దుండగుడు కారులో ప్రయాణిస్తూ విదేశీ పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. గాయపడిన వారంతా విదేశీయులేనని వెల్లడించారు. దాడి చేసిన 28 ఏళ్ల వ్యక్తి ఇటలీ దేశస్తుడని తెలిపారు. అతనికి నేర చరిత్ర లేదని వెల్లడించారు.

సుమారు రెండు గంటల పాటు తన కారులో ప్రయాణిస్తూ విచ్చలవిడిగా కాల్పులు జరిపిన తరువాత దుండగుడు ఓ చోట వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. అనంతరం దానికి కొంచెం దూరంలోనే పోలీసులకు చిక్కాడు. బాధితులంతా నల్లజాతి వారేనని, ఈ ఘటనకు ఇటీవల జరిగిన ఇటలీ యువతి హత్యకు సంబంధం ఉండొచ్చని వారు భావిస్తున్నారు. 18 ఏళ్ల పమేలా మాస్ట్రోపిట్రో అనే యువతిని కూడా చంపి ఆమె మృత దేహాన్ని ముక్కలు చేసి రెండు సూట్‌కేసుల్లో కుక్కిన విషయం గత బుధవారం వెలుగుచూసింది. ఈ కేసులో నైజీరియా పౌరుడిని నిందితుడిగా చేర్చారు.  

మరిన్ని వార్తలు