వైఎస్సార్‌ జిల్లాలో ఘోర ప్రమాదం

21 Oct, 2019 09:43 IST|Sakshi

కంటైనర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు దుర్మరణం

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లి చెరువుకట్ట సమీపంలో కారు అదుపు తప్పి కంటైనర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లీకొడుకు సహా కారు డ్రైవర్‌ ఉన్నారు. వీరంతా నందలూరు మండలం నీలిపల్లె గ్రామస్తులు. కడప నుంచి చెన్నైకి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు దాసరి మణెమ్మ (45), సాయి కిరణ్‌, (19), పవన్‌ కల్యాణ్‌ (25)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.


డివైడర్‌ను ఢీకొన్న ఆరెంట్‌ ట్రావెల్స్‌ బస్
కాగా విజయవాడ గుణదల సమీపంలో ఆరెంట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోల్తా పడిన బస్సును పోలీసులు క్రేన్‌ సాయంతో పక్కకి తొలగించారు. గాయపడిన ప్రయాణికుల్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

కంటైనర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి
మరోవైపు తెలంగాణలో సిద్ధిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో​ ముగ్గురు మృతి చెందారు. ప్రజ్ఞాపూర్‌ రాజీవ్‌ రహదారిపై ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మానకొండూరు మండలం వేగురుపల్లికి చెందినవారు. వీరంతా హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు