వేర్వేరు ఘటనల్లో ఆరుగురి అదృశ్యం

14 Oct, 2019 10:37 IST|Sakshi

తల్లీ,కూతురు అదృశ్యం..

మల్కాజిగిరి: కుమార్తెతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మారేడ్‌పల్లికి చెందిన లత గత కొన్నినెలలుగా హనుమాన్‌పేట్‌లో ఉంటున్న కుమార్తె రాణి, అల్లుడు రాజు ఇంట్లో ఉంటోంది. ఈ నెల 12న ఆమె బయటికి వెళ్లి వచ్చే సరికి కుమార్తె రాధ(23),  మనుమరాలు రిత్విక కనిపించలేదు. వారి కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో అదే రోజు రాత్రి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.

మహిళ అదృశ్యం..  
చందానగర్‌ :ఓ మహిళ అదృశ్యమైన సంఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చైతన్యపురి హనుమాన్‌నగర్‌కు చెందిన రేఖరాజు శైలజ కుటుంబంతో కలిసి శనివారం మియాపూర్‌లోని ఆర్‌ఎస్‌ గ్రాండ్‌ హోటల్‌లో  బంధువుల పెళ్లికి వచ్చారు. పెళ్లి అనంతరం చిన్న గొడవ జరగడంతో శైలజ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు.  ఆమె తండ్రి శంకర్‌రావు ఫిర్యాదు మేరకు చందానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాలేజీకి వెళ్లిన విద్యార్థిని...
యాకుత్‌పురా: కాలేజీకి వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై జబ్బార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  సుల్తా¯న్‌షాహి ప్రాంతానికి చెందిన యాదయ్య కుమార్తె ప్రవళ్లిక (21) నారాయణ గూడలోని రెడ్డి కళాశాలలో బీకాం ఫైనలియర్‌ చదువుతుంది. శనివారం ఉదయం కాలేజీకి వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాలుడు అదృశ్యం
చాంద్రాయణగుట్ట: ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై అరవింద్‌ గౌడ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.లాల్‌దర్వాజా ప్రాంతానికి చెందిన  ఈశ్వర్‌ కుమారుడు సాయి కిరణ్‌(9) వెంకట్రావ్‌ స్మారక ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు.  ఈ నెల 11న ఉదయం ఇంటినుంచి బయటికి వెళ్లిన సాయి కిరణ్‌ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడి కోసం గాలించినా ప్రయోజనం కనిపించలేదు.  అతని తల్లి బిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

తండ్రి మందలించాడని యువకుడు..
మల్కాజిగిరి:తండ్రి మందలించాడని ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇందిరానెహ్రునగర్‌కు చెందిన నర్సింహ, అలివేలు మంగ దంపతులకు సాయికుమార్‌(20), శివకుమార్‌ అనే ఇద్దరు కుమారులు. ఈ నెల 9న రాత్రి మద్యం తాగి వచ్చిన నర్సింహ భార్యతో గొడవపడుతుండటంతో సాయికుమార్‌ అతడిని వారించాడు. దీంతో నర్సింహ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్తానికిలోనైన సాయికుమార్‌ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతున్నానని వెతకవద్దని తమ్ముడు శివకుమార్‌కు చెప్పి వెళ్లాడు.అతని కోసం గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో ఆదివారం అతడి తల్లి అలివేలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు