లా విద్యార్థికి ఆరు నెలల జైలు

20 Jun, 2020 10:19 IST|Sakshi
అరవింద్‌

రూ.5 వేల జరిమానా న్యాయమూర్తి తీర్పు

గంజాయితో పట్టుబడిన నిందితుడు

ఇబ్రహీంపట్నంరూరల్‌: గంజాయితో పట్టబడ్డ విద్యార్థికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ ఇబ్రహీంపట్నం 25వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ తీర్పు వెల్లడించారని ఆదిబట్ల సీఐ నరేందర్‌ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో నివాసం ఉంటున్న సాయిని అరవింద్‌ అనే విద్యార్థి గంజాయితో పట్టుబడ్డాడు. ఇతని స్వస్థలం కరీంనగర్‌ జిల్లా గొల్లపల్లి మండలం చందోలి. నగరంలోని దోమల్‌గూడలోని ఏవీ కళాశాలలో న్యాయవాద విద్య మూడో సంవత్సరం చదువుతున్నాడు.

కరీంనగర్‌లోని చెడు వ్యసనాల వల్ల అతనికి గంజాయి అలవాటైంది. ఈ క్రమంలో 17– 7– 2017వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు సిల్వర్‌ కలర్‌ ఆల్టో కారులో గంజాయి పొట్లాలతో వస్తూ ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న అప్పటి సీఐ గోవింద్‌రెడ్డికి పట్టుబడ్డారు. దీంతో అతన్ని అరెస్టు చేసి గంజాయి, వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ మంగళ్‌హాట్‌ దూళ్‌పేట్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేశానని, తనకు గంజాయి తాగే అలవాటు ఉందని పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ కేసును విచారణ జరిపిన ఇబ్రహీంపట్నం 25వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ నిందితుడిని దోషిగా గుర్తిస్తూ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు తెలిపారు. ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో గోవింద్‌రెడ్డి, వరలక్ష్మి, శేఖర్‌ ఈ విచారణలో ఉన్నట్లు సీఐ నరేందర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు