లాహోర్ : సరదాగా మొదలైన ఆట.. చివరకు ఓ విద్యార్థి ప్రాణం తీసేసింది. పాకిస్థాన్ పంజాబ్ ప్రొవిన్స్లోని మియాన్ ఛన్ను ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ విరామ సమయంలో ఆరో తరగతి చదువుతున్న బిలాల్, అమీర్ అనే ఇద్దరు విద్యార్థులు తప్పర్ కబడ్డీ(చెంప దెబ్బల ఆట.. పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈ ఆట ప్రాచుర్యంలో పొందింది)కి సిద్ధమయ్యారు. టీచర్లు, విద్యార్థుల సమక్షంలో వారు దెబ్బల వర్షం కురిపించుకున్నారు. అమీర్ దెబ్బలకి తాళలేక బిలాల్ కుప్పకూలిపోగా.. సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
పోలీసులు ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకుని కొన ఊపిరితో ఉన్న బిలాల్ను ఆస్పత్రికి తరలించారు. అయితే మెడపై బలమైన దెబ్బలు పడి.. నరాలు చిట్లిపోయాయని, ఆలస్యంగా తీసుకురావటం వల్లే అప్పటికే అతని ప్రాణాలు పోయాయని వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన బిలాల్ తల్లిదండ్రులు తమ కొడుకు చావు దైవాజ్ఞ అని చెప్పటం గమనార్హం. ఈ ఘటన ఈ నెల మొదట్లో చోటుచేసుకోగా.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి గత రెండు రోజులుగా కొన్ని మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.