సెల్‌ఫోన్‌ దొంగ అరెస్ట్‌

12 Feb, 2019 09:25 IST|Sakshi

9 సెల్‌ఫోన్లు స్వాధీనం   

మలక్‌పేట: సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని సోమవారం మలక్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేసి అతడి నుంచి తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. వనపర్తి జిల్లా, చిన్నచింతకుంట గ్రామానికి చెందిన మహ్మద్‌ జావేద్‌ బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి చంద్రాయణ గుట్ట ఆఫీజ్‌బాబానగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న అతను హాస్టల్లోకి చొరబడి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లేవాడు.  ఆదివారం గడ్డిఅన్నారంలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్లో చొరబడి 9 సెల్‌ ఫోన్లు చోరీ చేశాడు. హాస్టల్‌ నిర్వాహకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

అతడిపై ఎస్‌ఆర్‌నగర్, నల్లకుంట, రాజేంద్రనగర్, మదాపూర్, మీర్‌పేట, చిక్కడపల్లి, నారాయణగూడ, వనస్థలిపురం, ఉప్పల్, సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్లలో 18 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇటీవల నారాయణగూడ పోలీసులు దొంగతనం కేసులో అరెస్ట్‌ చేసి  చంచల్‌గూడ జైలు తరలించారు. ఈనెల 7న జైలు నుంచి బయటికి వచ్చిన మరుసటిరోజే అతను మళ్లీ పంజా విసరడం గమనార్హం. అతడి నుంచి 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు