మోదీ సోదరుని కుమార్తెకూ తప్పని స్నాచర్ల బెడద

12 Oct, 2019 14:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో  వివిధ ప్రాంతాల్లో  స్నాచింగ్ కేసులు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. తాజాగా సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ  సోదరుని కుమార్తె కూడా స్నాచర్ల బారిన పడ్డారు.  బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు దమయంతి బెన్ మోదీ పర్సును లాక్కుపోయారు. సివిల్ లైన్స్‌లోని గుజరాతీ సమాజ్ భవన్ హోటల్‌ గేటు వెలుపల  శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి సమీపంలోనే ఉండటం గమనార్హం.

ఇండియా టుడే అందించిన కథనం ప్రకారం.. ప్రధానిమోదీ సోదరుని కుమార్తె దమయంతి బెన్ మోదీ శనివారం ఉదయం అమృత్‌సర్‌ నుండి ఢిల్లికి వచ్చారు. సివిల్ లైన్స్ ప్రాంతంలోని గుజరాతీ సమాజ్ భవన్‌లో ఒక గదిని బుక్ చేసుకున్నారు. ఆమె హోటల్ గేటు వద్దకు  చేరుకోగానే, బైక్‌ఫై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె పర్సును లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. వాలెట్‌లో సుమారు రూ. 56,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఇతర ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని ఆమె తెలిపారు. తిరుగు ప్రయాణానికి సంబంధించిన విమాన టికెట్లు  కూడా పర్సులోనే ఉన్నాయని దమయంతి బెన్‌ వాపోయారు. ఆమె ఫిర్యాదు మేరకు  కేసు నమోదు  చేసుకున్న  ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు