ఐఫోన్‌ పార్సిల్‌లో సబ్బు

2 Aug, 2018 08:29 IST|Sakshi

టీ.నగర్‌: తక్కువ ధరకు ఐఫోన్‌ ఇస్తున్నట్లు తెలిపి బాక్సులో సబ్బు పెట్టి బ్యాంకు మేనేజర్‌ని మోసగించిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన చెన్నై మైలా పూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై మైలాపూర్‌లోని వీఎం లేన్‌ కి చెందిన రమేష్‌ (36) లజ్‌ చర్చి సమీపంలోని ఒక ప్రముఖ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు బ్యాంకు దగ్గరకు వచ్చి వాచ్‌మెన్‌తో నవ్వుతూ మాట్లాడారు.

ఒకరు బ్యాంకు మేనేజర్‌ రమేష్‌ వద్దకు వెళ్లి మాట్లాడారు. తక్కువ ధరకు ఐఫోన్‌ ఉందని, ధర రూ.15 వేలు మాత్రమేనని తెలుపుతూ ఒక సెల్‌ఫోన్‌ అతనికి చూపాడు. పక్క బ్యాంకులో రెండు సెల్‌ఫోన్లు, మరో ఫోన్‌ మాత్రమే మిగిలాయని నమ్మబలికాడు. అతని వద్ద ఉన్న పార్సిల్‌ను రమేష్‌ తీసుకున్నాడు. తర్వాత రమేష్‌ వద్ద రూ.15 వేలు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బ్యాంకు మేనేజర్‌ రమేష్‌ పార్సిల్‌ విప్పి చూడగా అందులో సబ్బు కనిపించడంతో దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే మైలా పూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు