ఏసీబీ వలలో సాంఘిక సంక్షేమ డీడీ

15 Feb, 2018 02:35 IST|Sakshi
డీడీ యాదయ్య (ఫైల్‌)

    క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌ నుంచి రూ.లక్ష తీసుకుంటుండగా పట్టివేత

     మరో వార్డెన్‌ను కూడా పట్టుకున్న ఏసీబీ అధికారులు

కరీంనగర్‌ క్రైం: క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌ నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ కరీంనగర్‌ సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్‌ యాదయ్య బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. కరీంనగర్‌లోని మారుతి నగర్‌ కు చెందిన బాకం కనకయ్య 25 ఏళ్లుగా కరీం నగర్‌లోని పలు ప్రభుత్వ వసతిగృహాలకు కూరగాయలు, గుడ్లు, అరటి పండ్లు సరఫరా చేస్తున్నాడు. 2017–18 సంవత్సరానికి 2017 జూన్‌లో టెండర్లు వేయగా, కనకయ్య పాల్గొ న్నాడు. టెండర్‌ కనకయ్యకు రావాలంటే డీడీ యాదయ్య రూ.1.30 లక్షలు డిమాండ్‌ చేశాడు.

అందుకు అంగీకరించిన కనుకయ్య చెక్కును డీడీకి ఇచ్చాడు. చెక్కు చెల్లకపోవడంతో గతేడాది నవంబర్‌లో దానిని వెనక్కి ఇచ్చేశాడు. అప్పటి నుంచి పది నెలల బిల్లులు చెల్లించకుండా వేధించడం ప్రారం భించాడు. తర్వాత 5 నెలల బిల్లులు మం జూరు చేసినా.. మిగిలిన రూ.2.5 లక్షల బిల్లు కోసం  యాదయ్య చుట్టూ కాంట్రాక్టర్‌ తిరిగినా ఉద్దేశపూర్వకంగానే పెం డింగ్‌లో ఉంచాడు. చివరకు రూ.లక్ష ఇస్తేనే మిగతా బిల్లులు వస్తాయని, లేకుంటే అంతే సంగతి అని, మరోసారి తన వద్దకు రావద్దని, రాంనగర్‌లోని బాలుర వసతిగృహం వార్డెన్‌ శ్యాం సుందర్‌రావుతో రావాలని, లేకుంటే లేదని చెప్పాడు. కనకయ్య శ్యాంసుందర్‌ రావును కలవగా.. డీడీ తనకు ఫోన్‌ చేశాడని, ఒప్పుకున్న మేరకు రూ.లక్ష ఇవ్వాల్సిందేనని చెప్పాడు.

బుధవారం కనకయ్య డబ్బులు ఇచ్చేందుకు డీడీకి ఫోన్‌ చేయగా, తాను అందుబాటులో లేనని.. శ్యాంసుందర్‌రావుకు ఇవ్వాలని చెప్పాడు. బుధవారం ఇద్దరూ కలసి డీడీ ఇంటికి వెళ్లి రూ. లక్ష ఇస్తుండగా.. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ సుదర్శన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. రూ.లక్ష స్వాధీనం చేసుకుని యాదయ్యతోపాటు శ్యాంసుందర్‌రావుపై కేసు నమోదు చేశారు. గురువారం రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా, డీడీ యాదయ్యపై ఆరోపణలు వెల్లువెత్తడంతో గతంలో ‘సాక్షి’  వరుస కథనాలను ప్రచురించింది. 

మరిన్ని వార్తలు