సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

13 May, 2018 11:06 IST|Sakshi
చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న నాగేందర్‌రెడ్డి

అనంతగిరి : జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ కూకట్‌పల్లి హైదర్‌నగర్‌కు చెందిన నాగేందర్‌రెడ్డి(22) బెంగుళూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా గత రెండు సంవత్సరాలు క్రితం తల్లి మరణించింది. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒంటరిగా మానసికంగా కుంగిపోయిన నాగేందర్‌రెడ్డి ఉద్యోగం చేయడం ఆసక్తి లేదని కొద్దిరోజుల క్రితం ఫోన్‌ ద్వారా తాతకు సమాచారం అందించాడు. ఈ నెల 9న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సమీప బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు ఎంతకీ ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం వికారాబాద్‌లోని లాలాగూడ సమీపంలోని బ్రిడ్జి సమీపంలో చెట్టుకు ఉరేసుకున్న విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా లభించిన ఆధారాలను బట్టి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు మృతుడి తాత నాగిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు