కోడలిపై కన్నేశాడు.. కొడుకు చేతిలో చచ్చాడు

17 Mar, 2020 13:30 IST|Sakshi
తమ్మారావు ,రోదిస్తున్న మృతుడి భార్య దండమ్మ, కుటుంబ సభ్యులు

శ్రీరాంపురంలో తండ్రిని హతమార్చిన కొడుకు  

‘కామాతురాణాం నభయం నలజ్జ’ అన్నారు పెద్దలు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక మామ సొంత కోడలిపై కన్నేసి కోరిక తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. కొడుకు ఇంటిలో లేని సమయంలో కన్న కూతురితో సమానమైన కోడలిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ దురాగతాన్ని భరించలేని కొడుకు.. తండ్రిని హత్య చేశాడు. ఈ సంఘటన కొత్తపల్లి మండలంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి బంధువుల కథనం ఇలా ఉంది.

తూర్పుగోదావరి, కొత్తపల్లి: శ్రీరాంపురం గ్రామానికి చెందిన పిర్ల తమ్మారావు (55)కు ఇద్దరు కుమారులు ఆదినారాయణ, సుబ్బారావు. భార్యతో కలిసి తమ్మారావు ఉప్పాడ–పెరుమాళ్లపురం బీచ్‌ రోడ్డు సమీపంలో ఉన్న పొలంలో గేదెలను మేపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన శ్రీరాంపురంలో ఉంటున్న పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లాడు. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో కోడలు చేయి పట్టుకుని లైంగిక దాడి చేయబోయాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. ఈ విషయాన్ని తట్టుకోలేక కుమారుడు తండ్రిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

ఆదివారం రాత్రి తన పొలంలో నిద్రిస్తున్న తండ్రి తలపై అతడు బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కాకినాడ డీఎస్పీ భీమారావు, పిఠాపురం సీఐ బి. సూర్య అప్పారావు, కొత్తపల్లి ఎస్సై పార్ధసారథి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య దండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుమారుడు ఆదినారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని హత్య చేసిన కుమారుడు పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమ్మారావు మృతితో శ్రీరాంపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.   

మరిన్ని వార్తలు