నాన్న లేని లోకంలో ఉండలేనని..

19 Jan, 2020 10:35 IST|Sakshi

తండ్రి మృతిని తట్టుకోలేక తనయుడి ఆత్మహత్య

అనారోగ్యంతో మృతిచెందిన తండ్రి..

క్రిమిసంహారక మందు తాగిన తనయుడు

దిమ్మదుర్తిలో విషాదం

సాక్షి, మామడ(నిర్మల్‌):  ఆయనకు తండ్రి అంటే ప్రాణం.. తండ్రికి కొడుకంటే ఎనలేని ఇష్టం.. ఒకరిని విడిచి మరొకరు ఎప్పుడూ ఉన్నది లేదు. నిరుపేద కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి తండ్రికి తోడుగా కూలీ పనులకు వెళ్తూ... వారికి ఉన్న మేకలను సాకుతు కాలం గడుపుతున్నారు. గత ఐదారు నెలల క్రితం తండ్రికి లివర్‌ క్యాన్సర్‌ సోకింది. హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స నిర్వహించుకుంటున్నాడు.

ఆర్థిక ఇబ్బందులతో మెరుగైన వైద్యం కోసం వెళ్లలేని పరిస్థితి. దీంతో శనివారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లి పరిస్థితి విషమించి మృతి చెందగా తండ్రి మరణాన్ని తట్టుకోలేని తనయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

మండలంలోని దిమ్మదుర్తి గ్రామానికి చెందిన చింతల నాగరాజు, లక్ష్మి దంపతులకు కుమారుడు నవీన్‌ (20), కూతురు ఉన్నారు. ఇటీవల తండ్రి చింతల నాగరాజు క్యాన్సర్‌ సోకి అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి విషమించి శనివారం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి స్వగ్రామానికి అంబులెన్స్‌లో తీసుకురాగా కుమారుడు నవీన్‌ ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఆయన మార్గంమధ్యలో పురుగుల మందు తాగి పడిపోయాడు.

తండ్రి అంత్యక్రియలకు నవీన్‌ రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం మొదలుపెట్టారు. దీంతో కొండాపూర్‌ సమీపంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న నవీన్‌ను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని గ్రామానికి తరలించారు.  తండ్రీకొడుకులు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. 

మరిన్ని వార్తలు