క్షణికావేశం..ఓ ప్రాణం తీసింది!

18 Jan, 2019 12:27 IST|Sakshi

ఆస్తి విషయమై తండ్రీకుమారుల ఘర్షణ

కుమారుడి దాడిలో తండ్రి దుర్మరణం

అనంతపురం, నార్పల: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. ఆస్తి విషయంలో మొదలైన చిన్నపాటి గొడవ ఏకంగా ఓ తండ్రి ప్రాణాన్నే బలిగొంది. ఈసంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..మండల కేంద్రంలోని ఉయ్యాలకుంటలో నివాసముంటున్న తిరుపతయ్య(58)కు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు రాజకుళ్లాయప్ప ఉన్నారు. గురువారం రాత్రి ఆస్తి విషయమై తిరుపతయ్యకు కుమారుడి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. మాటామాట పెరిగి కుమారుడు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు.

ఈక్రమంలో పక్కనే ఉన్న రాయిని తండ్రిపై విసిరాడు. రాయి నేరుగా తలను తాకడంతో తీవ్ర రక్తస్రావమై తిరుపతయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ పుల్లయ్య ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు